కార్తీక పురాణం 20వ అధ్యాయం: పురంజయుడు దురాచారుడగుట

జనక మహారాజు, చాతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో "గురువర్యా! కార్తీకమాస మాహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రతమాహాత్మ్యమునం దింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్ధునిగా జేయు" డనెను. ఆ మాటలకు వశిష్ఠులవారు మందహాసముతో "ఓ రాజా! కార్తీకమాస మాహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికిజరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను ఆలకించు" మని ఆ కథావిధానము ను యిట్లు వివరించిరి.

పూర్వమొకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షిని గాంచి "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మాహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగ తెలియును. కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహాముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమయినది. కార్తీకమాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, అరోగ్యసంపదకు సాటియగు సంపదలేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏమానవుడైనను కార్తీకమాసమున నదిలో స్నానము చేసినను,శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందొకొక యితిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల బడినది. వారు తమలో తామాలోచించుకొని , కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యా నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనముచేసి యుద్ధమునకు సిద్దపడిరి.

అయోధ్యానగరమును ముట్టాడించిన సంగతిని చారులవలన తెలిసికొనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్ధుడై యుండెను. అయినను మొదటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి
సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ద సన్నద్ధుడై వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గరించునట్లు హూంకరించి శత్రుసైన్యములపై బడెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి వింశాధ్యాయము

ఇరవయ్యో రోజు పారాయణము సమాప్తము.